Wednesday 21 December 2016

న‌యా తుగ్ల‌క్ ఆగ‌యా.....

తుగ్ల‌క్ .. ఎప్పుడో 13వ శ‌తాబ్దంలో చేసిన పాల‌న త‌రాలు మారినా ఇంకా మ‌ర్చిపోలేదు. నిజానికి ఆ పాల‌న చూసిన త‌రాలు అంత‌రించి ఏడు ద‌శాబ్దాలు గ‌డిచిపోయాయి. ఇప్ప‌డు కూడా తుగ్ల‌క్ ను మించిన పాల‌నా ద‌క్షులు మ‌న‌కు తోడ‌య్యారు. తొడేళ్ల‌లా ప్ర‌జ‌ల ప్రాణాల‌తో వారు చెల‌గాట‌మాడుతున్నారు. భావితరాలు వారిని తుగ్ల‌క్ త‌ర‌హాలో గుర్తుంచుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. అందులో స‌రికొత్త‌గా రిజ‌ర్వు బ్యాంకు ఇచ్చిన రూల్ ఒక‌టి. ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 30 లోపు పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం ఒక్కసారే ఉంటుంది. డిపాజిట్ చేసే సొమ్ము రు 5,000 గానీ అంతకు లోపు గానీ ఉంటే బ్యాంకు వాళ్ళు నిన్ను ఏమీ అనరు. 5,000 కు పైన ఉంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. అంతటితో అయిపోలేదు. 5,000 రూపాయల వరకు డిసెంబర్ 30 లోపు ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయొచ్చు. ఉదాహరణకి 1000/- చొప్పున 5 సార్లు డిపాజిట్ చేయొచ్చు. కానీ 5000 దాటితే మాత్రం ఒకే ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రు 5000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయకుండా ఉన్నందుకు మీరు తగిన, సంతృప్తికరమైన వివరణను బ్యాంకు అధికారులకు ఇవ్వవలసి ఉంటుంది.

ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ప్రకారం రు 5000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన ఖాతాదారును ఇద్దరు బ్యాంకు అధికారులు విచారిస్తారు. ఖాతాదారు వారిని సంతృప్తిపరిచే వివరణ ఇవ్వాలి. ఖాతాదారు వివరణను ఇద్దరు బ్యాంకు అధికారుల సమక్షంలో రికార్డు చేయాలి. డిపాజిట్ తో పాటు బ్యాంకు అధికారులు అడిగే వివిధ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఇంకమ్ ట్యాక్స్ అధికారులు చేయవలసిన పనిని డిసెంబర్ 30 వరకు బ్యాంకు అధికారులు నిర్వహిస్తారు. అది కూడా ఆదాయానికి మించి డబ్బు ఉన్నందుకు కాదు. ఒక తుగ్ల‌క్ ప్రభుత్వం రు 5,000 కు మించి డిపాజిట్ చేయరాదని హఠాత్తుగా నిర్ణయించడం వల్ల బ్యాంకు అధికారులు ఐ.టి పోలీసింగ్ అధికారులుగా మారగా డిపాజిట్ దారులు వారి ముందు నేరస్ధులుగా నిలబడాల్సి వస్తుంది.

ప్ర‌ధాని మోదీ డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ప్రారంభ దినాల్లో విత్త‌మంత్రి జైట్లీ ప్రకటన ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకులు, ఏ‌టి‌ఎం ల ముందు చాంతాడంత క్యూలలో జనం నిలబడడాన్ని తప్పు పడుతూ “ఎందుకు ఎంత తొందర? డిసెంబర్ 30 వరకు మీకు సమయం ఉంది. ఆ లోపు ఏ రోజైనా మీరు మీ సొమ్ముని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. అప్పుడే క్యూలలో నిలబడి ఇబ్బంది పడవద్దు. బోలెడు సమయం ఉంది కదా!” అని పరిహాసం ఆడారు; హామీ ఇచ్చారు; భరోసా ఇచ్చారు. ఈ రోజేమో “5,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మిమ్మల్ని అనుమానించాల్సిందే. అసలు ఇన్నాళ్లూ డిపాజిట్ చేయకుండా ఎందుకు ఆగారు? రద్దు చేశాక అంతంత డబ్బుని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు?” అని అదే జైట్లీ అడుగుతున్నాడు. లేదా ఆర్‌బి‌ఐ చేత అడిగిస్తున్నాడు. ఆ నాడు జైట్లీ ఇచ్చిన హామీని, భరోసాను నమ్మి ‘ఇంకా సమయం ఉందిలే’ అని భావించినందుకు ఇప్పుడు అదే జైట్లీ ముందు దోషిలా నిలబడే పరిస్ధితి కల్పించారు. జైట్లీ మాటలు నమ్మినందుకు జైట్లీయే దోషిగా నిలబెడుతున్నాడు.

ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ వెలువడ్డాక చానెళ్లు, ఆర్ధిక నిపుణులు, విశ్లేషకులు మరోసారి కేంద్రం నిర్ణయంపై విరుచుకుపడ్డారు. పదే పదే నిర్ణయాలు మార్చుతూ జనాన్ని అయోమయం లోకి నేడుతున్నారని ఆర్‌బి‌ఐ పైన విశ్వాసాన్ని మంట గలుపుతున్నారని, బ్యాంకుల పైన ఉంచిన నమ్మకాన్ని బలహీనం చేస్తున్నారని విమర్శలు కురిపించారు. దానికి ఆర్ధిక మంత్రి జైట్లీ సరికొత్త వివరణతో ముందుకు వచ్చారు. ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ కు వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చే పేరుతో ఆయన ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ తో దాదాపు విభేదించారు. అటు ఇటూ తిప్పి ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ కు విరుద్ధమైన వివరణను ఇచ్చారు.
5000 మాత్రమే కాదు, ఎంతయినా బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. మిమ్మల్ని ఎవరూ ఏమీ అడగరు. కానీ డిసెంబర్ 30 లోపు అదంతా ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయండి. డిసెంబర్ 30 లోపు మీరు రెండోసారి డిపాజిట్ చేయడానికి వెళ్తే అప్పుడు మిమ్మల్ని అనుమానించవలసి వస్తుంది. ఒకేసారి డిపాజిట్ చేయడానికి బదులు పలు దఫాలుగా ఎందుకు డిపాజిట్ చేస్తున్నారన్న అనుమానం వస్తుంది. అందుకని మిమ్మల్ని బ్యాంకు అధికారులు వివరణ అడుగుతారు. డాక్యుమెంట్లు సమర్పించాలి.”

ఆర్‌బి‌ఐ యేమో రు 5000 లోపు ఎన్నిసార్లైనా జమ చేయొచ్చు అని చెబుతుంది. ఆర్ధిక మంత్రి వివరణలో ఆ 5000 పరిమితి సంబంధించిన ప్రస్తావనే ఉండదు. 5000 మించితే బ్యాంకు అధికారుల ప్రశ్నలకు/విచారణకు వివరణ/సమాధానం ఇచ్చుకోవాలి అని ఆర్‌బి‌ఐ అధికారికంగా చెబుతుంది. ‘అబ్బే 5000 లిమిట్ లేదు. ఒకసారి ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరూ ఏమీ అడగరు’ అని ఆర్ధిక మంత్రి నోటి మాటగా చానెళ్లలో కనబడి వివరణ ఇస్తారు.

ఎవరిని నమ్మాలి? ఆర్‌బి‌ఐ అధికారిక నోటిఫికేషన్ ను నమ్మాలా? లేక ఆర్ధిక మంత్రి నోటి మాట వివరణను నమ్మాలా? బ్యాంకులకు ఆర్ధిక మంత్రి వివరణ అందదు. కేవలం ఆర్‌బి‌ఐ అధికారిక నోటిఫికేషన్ మాత్రమే బ్యాంకులకు చేరుతుంది. బ్యాంకులు ఆర్‌బి‌ఐ ఆదేశాలను మాత్రమే పాటిస్తాయి. బ్యాంకుల రెగ్యులేటర్ ఆర్‌బి‌ఐ మాత్రమే. 
కానీ ఆర్ధిక మంత్రి స్వయంగా ఇచ్చిన వివరణ చెల్లకుండా ఎలా పోతుంది? అసలు ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ కి విరుద్ధంగా ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వం నుండి రెండు విరుద్ధ ఆదేశాలు అందితే ప్రజలు దేన్ని నమ్మాలి? బ్యాంకింగ్ వ్యవస్ధ దేనిని పాటించాలి? ఈ మాత్రం సామాన్య పరిజ్ఞానం కూడా ఆర్ధిక మంత్రికి లేకుండా ఎలా పోయింది?

న‌వంబర్ 8 తేదీన ప్రధాని డీమానిటైజేషన్ ప్రకటించాక ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది 52 వసారి. ఈ నోటిఫికేషన్లు అన్నీ డీమానిటైజేషన్ మీద ఇచ్చినవే. పాత నోట్లకు కొత్త నోట్ల మార్పిడిపై అనేక సార్లు నిబంధనలు మార్చారు. వివిధ వర్గాలకు మినహాయింపులు ఇవ్వడంలో అంకెలు మార్చుతూ పోయారు. డిపాజిట్ చేసే మొత్తాలపై అనేక నోటిఫికేషన్లు జారీ చేశారు. బంగారంపై పరిమితి విధిస్తూ నోటిఫికేషన్ ఇచ్చి ఆనక వెనక్కి తగ్గారు. వీళ్ళకి పక్కాగా ఒక ప్లాన్ అంటూ ఉంటే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నిబంధనలు మార్చుతూ పోతారా? తాము ఏమి చేస్తున్నామో తమకే తెలియని అయోమయ పరిస్ధితిలో ఉన్నవారే ఇలా రోజుకొక్క నిబంధనని ప్రజలపై రుద్దుతారు. కుప్పి గంతులు వేస్తూ జనం చేత కూడా కుప్పి గంతులు వేయించే తుగ్ల‌క్ చర్యలకు దిగుతారు.

No comments:

Post a Comment